Tuesday 21 April 2015

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు

ప్రత్యేక హోదా ఇవ్వకపోవచ్చు


  •  ఆ స్థాయి ప్యాకేజీ సాధనకు సిద్ధం కావాలి
  •  కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి
  •  ఒకటికి రెండుసార్లు అడగాలి
  •  చైనా స్థాయిలో నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలి
  •  పార్టీ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబు
  •  పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించాలని నిర్ణయం
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కనిపించట్లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా స్థాయి ప్యాకేజీని సాధించుకునేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఆయన సూచించారు. ఏపీ భవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్‌ గజపతిరాజు సహా పార్టీ ఎంపీలంతా ఈ భేటీకి హాజరయ్యారు. బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఇందులో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఒకపక్క ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇవ్వకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంటుల రూపంలో వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా అదే స్థాయిలో.. లేదంటే 70 శాతానికి తగ్గకుండా నిధులు సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని సూచించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని కలవాలని తెలిపారు. ఒకటికి రెండుసార్లు కేంద్ర మంత్రుల్ని కలవటంలో తప్పు లేదని, వాస్తవానికి అలా కలిసి వివరించబట్టే గత నెలలో రాషా్ట్రనికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. ఆర్థిక సంవత్సరం చివర్లో రాషా్ట్రనికి రావాల్సిన నిధుల్ని విడుదల చేయించుకోవటంలో ఎంపీల చొరవను ప్రశంసించారు. విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సి ఉందని.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బూర్గంపాడు గ్రామ అంశాన్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజధానికి నిధులు రాబట్టుకోవాలని, 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.690 కోట్లు విడుదల కావాల్సి ఉందని గుర్తు చేశారు.
కేంద్రానికి మద్దతివ్వాల్సిందే!
పార్లమెంటులోనూ బయటా ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలబడాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణ బిల్లు విషయంలో కూడా అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, జరపాల్సిన చర్చలు మొదలైన అంశాలపైనా పలు సూచనలు చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్ర చందనం ఎన్‌కౌంటర్‌ గురించి తమిళనాడు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తే తక్షణం స్పందించి వాస్తవాలను తెలియజేయాలన్నారు.
నీళ్లు వాడుకోనిస్తే కరెంటిద్దాం
తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తికి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆ నీటిని రాయలసీమ అవసరాలకు వాడుకునేందుకు తెలంగాణ అంగీకరిస్తే ఆ రాషా్ట్రనికి అవసరమైన విద్యుత్‌ను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. తన చైనా పర్యటన విశేషాలను కూడా చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. చైనాలో జరిగిన అభివృద్ధి చాలా బాగుందని కొనియాడారు. అదే స్థాయిలో నవ్యాంధ్రని అభివృద్ధి చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఎంపీలంతా తమతమ నియోజకవర్గాలు, జిల్లాలను అభివృద్ధి చేసుకునేందుకు విభిన్నమైన ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు. ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కొంతమేర నిధులు ఇస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధుల్ని మ్యాచింగ్‌ గ్రాంటుగా జతచేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చునని తెలిపారు. టాటా ఫౌండేషన్‌ సహకారంతో దాదాపు 400 గ్రామాల్లో స్వచ్ఛ భారత్‌ కింద మౌలిక సదుపాయాల కల్పనకు విజయవాడ ఎంపీ కేశినేని నాని చూపిన చొరవను ప్రశంసిస్తూ.. మిగతా ఎంపీలు కూడా ఇదే రీతిలో విభిన్నంగా ఆలోచించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.
ఢిల్లీ, ఏప్రిల్ 22:  ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకూ తామేమీ మాట్లాడబోమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. టీడీపీపీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ డిమాండ్‌ మాత్రం ప్రత్యేక హోదాయేనని, దాని కోసమే తాము ఇప్పటికీ కేంద్రాన్ని కోరుతున్నామని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదాను వదిలేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనిది మాత్రం భిన్నమైన పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య అనంతపురం పర్యటనకు వచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మరొకమారు ఈ అంశంపై మాట్లాడామని చెప్పారు.

మరో సింగపూర్‌ సాధ్యమా?

మరో సింగపూర్‌ సాధ్యమా?
  •  కష్టపడితే సాధ్యమేనంటున్న సింగపూర్‌ ప్రభుత్వ పెద్దలు
  •  ఏపీకి భూమి, వనరుల లభ్యత అనుకూలమని వెల్లడి
(సింగపూర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘సీమాంధ్రను మరో సింగపూర్‌ చేస్తాం’.. ఎన్నికల ముందు, ఎన్నికల ముగిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబుతోసహా టీడీపీ నేతలు తరచూ చెబుతున్న మాట ఇది. అభివృద్ధిపరంగా, పెట్టుబడులు, పర్యాటకులను ఆకర్షించడంలో అనేక వందల రెట్లు ముందున్న సింగపూర్‌ను అందుకోవడం ఏపీకి సాధ్యమేనా? చిత్తశుద్ధితో శ్రమిస్తే సాధ్యమేనంటున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు.. అధికారులు. సింగపూర్‌ కన్నా వనరుల పరంగా ఏపీ ఎంతో ముందు ఉందని, వ్యవసాయం.. ఉత్పత్తి పరిశ్రమలు.. భూమి.. మానవవనరులు.. ఇవన్నీ ఏపీని సింగపూర్‌ కన్నా మెరుగైనస్థానంలో ఉంచేందుకు దోహదపడే అంశాలని వారు విశ్లేషిస్తున్నారు.
 
పర్యాటకమే ప్రధానం
పర్యాటకంపైసింగపూర్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్న నదిని వీలైనంత శుభ్రం చేసి దానికి ఇరు పక్కలా పర్యాటక ఆకర్షణ కేంద్రాలను నిర్మించారు. అమెరికాకు చెందిన ఒక కంపెనీ రూ.40 వేల కోట్ల వ్యయంతో 88 అంతస్థులతో ఓ భవనాన్ని నిర్మించి అందులో కాసినోను ఏర్పాటు చేసింది. పర్యాటకుల కోసం ఒక ఈత కొలను, హోటళ్లు పెట్టింది. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడులు మూడేళ్లలో తిరిగి వచ్చేశాయని మీడియా బృందానికి సహాయకుడిగా వచ్చిన సింగపూర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సింగపూర్‌లో హోటళ్లు నిత్యం కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇక్కడ హోటళ్లకున్న డిమాండ్‌ను పట్టి సింగపూర్‌లో మూడో హోటల్‌ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. అభివృద్ధికి తలమానికంగా ఉన్న సింగపూర్‌కు భూ లభ్యతే పెద్ద సమస్యగా మారింది. చుట్టూ నీరు ఉన్న ద్వీపం కావడంతో వేరే దారి లేక సముద్రాన్ని పూడ్చి వాడకానికి అనువుగా మార్చుకొంటున్నారు. భూ లభ్యత సమస్య నివారణకు బహుళ అంతస్థుల నిర్మాణాలను విరివిగా చేపట్టారు.
 
ఆంధ్రప్రదేశ్‌ కూడా అందుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా సింగపూర్‌ మాదిరిగా అభివృద్ధిని అందుకోవచ్చునని, కావాల్సిందల్లా సరైన ప్రణాళిక మాత్రమేనని ఆ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రి షణ్ముగం అభిప్రాయపడ్డారు. ఏపీలో వనరుల లభ్యత అధికంగా ఉందన్నారు. ‘‘మాతో పోలిస్తే మీకు భూ లభ్యత చాలా ఎక్కువ. మేధో సంపత్తి కలిగిన మానవ వనరులూ ఉన్నాయి. ఐటీ పరిశ్రమ మీ వద్ద బాగా అభివృద్ధి చెంది ఉంది. పెద్ద పరిశ్రమలు రావడానికి...పెట్టడానికి మీకు వసతులు ఉన్నాయి. ఇన్ని వనరులుంటే అద్భుతాలు చేయవచ్చు. అంతేకాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపారాలను...వ్యాపార సంస్ధలను ఆకర్షించగలగాలి. వారిలో విశ్వాసం కలిగించాలి. ఆ పని చేస్తే సింగపూర్‌కు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడగలుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంఽధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసి ఇస్తున్న అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘తూర్పు ఆసియా దేశాల సముద్ర వాణిజ్యానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ ద్వారంగా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏ దారిలో వెళ్తే ఇతర దేశాలను ఆకర్షించగలమో అదే పనిని బాగా చేస్తోంది. దీనివల్ల అందరి దృష్టి ప్రస్తుతం అటువైపు పడుతోంది’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తాము మొత్తం పదహారు విడివిడి ప్రణాళికలు తయారు చేస్తున్నామని మరో అధికారి తెలిపారు. కాని ఈ ప్రణాళికల అమలుకు నిధుల సమీకరణే పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. దీనికి విదేశాల్లోని సంస్థల నుంచి నిధుల సమీకరణే మార్గమని సింగపూర్‌లోని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు విదేశాల్లో మంచి ట్రాక్‌ రికార్డు ఉందని, అందువల్ల ఫలితం ఉండవచ్చని అనుకొంటున్నామని ఒక అధికారి వ్యాఖ్యానించారు. 
 
ఇలా ఎదిగారు..
ఒకప్పుడు సింగపూర్‌ ఎంతో అధ్వానంగా ఉండేది. అక్కడి పాలకుల చిత్తశుద్ధితో క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చాయి. వనరులపరంగా ఇప్పటికీ సింగపూర్‌ బాగా వెనకబడి ఉంది. ఆ దేశంలో వ్యవసాయం లేదు. ఉత్పత్తి పరిశ్రమలు లేవు. భూమి లేదు. మానవ వనరులూ అంతంతే. ఒకానొక సమయంలో మంచినీటిని కూడా పొరుగున ఉన్న మలేషియా నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ ఇవేవీ సింగపూర్‌ అభివృద్ధికి అవరోధాలుగా నిలవలేదు. వారు ప్రతి వాన చుక్కను ఒడిసి పట్టుకోవడం నేర్చుకున్నారు. వాడిన నీటిని తిరిగి వాడుకోవడానికి అవసరమైన సాంకేతికతను సంపాదించారు. ‘న్యూ వాటర్‌’ పేరుతో పునర్వియోగ నీటిని తాగు నీటిగా మార్చి వాడుతున్నారు. అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించడంలోనూ సింగపూర్‌ కొత్త పుంతలు తొక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలను సింగపూర్‌కు ఆకర్షించడం ద్వారా నిధుల కొరతను ఆ దేశం అధిగమించగలిగింది. ‘పచ్చదనం, పరిశుభ్రత ఉన్న ప్రపంచస్థాయి నగరంగా సింగపూర్‌ను తీర్చిదిద్దడం ఒక్క రోజులో సాధ్యం కాలేదు. మురికివాడలు లేకుండా చేయడానికి ప్రభుత్వపరంగా గృహ నిర్మాణం చేపట్టి పౌరులకు నివాస వసతి కల్పించాం. నిరుద్యోగుల్లో నైపుణ్యాలు పెంచి ఉపాధికల్పనకు బాటలు వేశాం. భవిష్యత్తులో ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో నిర్ణయించుకొని ఒక మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసుకొన్నాం. కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తుండంతో పౌరులు సహకరించడం మొదలు పెట్టారు’ అని నగర ప్రణాళికా విభాగం అధికారి వివరించారు. 

నవ్యాంధ్ర హుస్సేన్‌ సాగర్‌ !

నవ్యాంధ్ర హుస్సేన్‌ సాగర్‌ !

తాడికొండ, ఏప్రిల్‌ 22 : నవ్యాంధ్ర రాజధాని నగరం తుళ్లూరులోని యరమాసు, గంటలమ్మ చెరువులుగా పిలిచే జంట చెరువుల రూపురేఖలు మారనున్నాయి. సుమారు 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన రెండు చెరువులను హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ తరహాలో తీర్చిదిద్ధాలని యోచిస్తున్నారు. చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని భావిస్తున్నారు. చెరువు పూడిక, అభివృద్ధి పనులను త్వరలో చేపట్టనున్నట్లు సర్పంచ్‌ నరసింహారావు తెలిపారు.